Thursday 1 December 2011

బ్రహ్మాస్త్రం.. 409 --- 420తో కలిస్తే బెయిలు దుర్గభం

బ్రహ్మాస్త్రం.. 409
420తో కలిస్తే బెయిలు దుర్గభం
మహా మహులకు ముచ్చెమటలు

నెలల తరబడి జైలు పక్షులు
'సత్యం' నుంచి శ్రీలక్ష్మి దాకా అందరిపై ఇదే సెక్షన్
హైదరాబాద్, నవంబర్ 29 : చట్టం చేతులు చాలా పొడవైనవి. ఈ చట్టంలోనూ కొన్ని సెక్షన్ల చేతులు మరీ బలమైనవి. అలాంటిదే... భారతీయ శిక్షా స్మృతిలోని 409 సెక్షన్. సత్యం కుంభకోణంలో రామలింగరాజుతో మొదలుకుని... గనుల కుంభకోణంలో సోమవారం అరెస్టయిన శ్రీలక్ష్మి దాకా అనేక మంది ప్రముఖులపై నమోదైన కేసుల్లో తప్పనిసరిగా కనిపించేది... 409 ఐపీసీ. ఈ కేసుల్లోని ఇతర సెక్షన్లన్నీ ఒక ఎత్తైతే... 409 ఐపీసీ ఒక ఎత్తు. ఇతరత్రా సెక్షన్ల కింద బెయిల్ వచ్చే అవకాశమున్నా... 409 దెబ్బకు అందరికీ దిమ్మ తిరుగుతోంది.

సీబీఐ చేతిలో ఇదో బ్రహ్మాస్త్రంగా మారింది. 'నిన్ను నమ్మి అప్పగిస్తే అంతా నాశనం చేశావు! విశ్వాస ఘాతకుడా!' అని నమ్మక ద్రోహులను తిట్టిపోస్తుంటారు. ఇలాంటి విశ్వాస ఘాతకులపై పెట్టేదే 409 సెక్షన్. విశ్వాస ఘాతుకం అనేది 'ఒంటరి' కాదు. ఇందులో మోసం, కుట్ర కోణాలు ఉంటాయి. 409ను జత చేస్తే ఇతర సెక్షన్లు కూడా బలోపేతమవుతాయి. మామూలుగానే 'పవర్ ఫుల్' అయిన 409 ఐపీసీ... ఇతర సెక్షన్లతో కలిసి 'సూపర్ పవర్‌ఫుల్' అవుతుంది.

స్థాయిని బట్టి శిక్ష
తప్పు ఒకటేకావచ్చు! కానీ... అది చేసే వారిని బట్టి 'తీవ్రత' మారుతుంది. కింది స్థాయి ఉద్యోగి చేసే తప్పునకు, నిర్ణయాధికారం చేతిలో ఉండే వారు చేసే తప్పిదానికి తేడా ఉంటుంది. తప్పు చేసిన వారిని బట్టి శిక్షలు కూడా మారతాయి. నిజానికి... 'క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్'ను ఐపీసీలో 405 సెక్షన్‌లో నిర్వచించారు. సామాన్య పౌరులు, వ్యక్తులు ఈ నేరానికి పాల్పడితే 406 ఐపీసీ కింద కేసు పెడతారు. వీరికి గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష మాత్రమే పడుతుంది. అలాగే... కొరియర్లు, రవాణా సంస్థలు విశ్వాస ఘాతుకానికి పాల్పడితే 407 ఐపీసీ కింద కేసు పెడతారు.

నేరం రుజువైతే గరిష్ఠంగా ఏడేళ్ల జైలు తథ్యం. ఇక... ఒక సంస్థలోని గుమాస్తాలు, కిందిస్థాయి ఉద్యోగులు విశ్వాస ఘాతుకానికి పాల్పడితే... ఐపీసీ 408 ప్రయోగిస్తారు. నేరం రుజువైతే... దోషులకు ఏడేళ్ల జైలు పడుతుంది. ఇక... అసలైన సెక్షన్ 409 ఐపీసీ. పబ్లిక్ సర్వెంట్ (ప్రజా ప్రతినిధులు లేదా ప్రభుత్వ ఉన్నతాధికారులు), వాణిజ్య వేత్తలు, మధ్యవర్తులు, అటార్నీలు, ఏజెంట్లు దీని పరిధిలోకి వస్తారు. నేరం రుజువైతే హీనపక్షం పదేళ్ల జైలు తప్పదు. గరిష్ఠంగా యావజ్జీవ శిక్ష విధిస్తారు. దీనికి జరిమానా అదనం!

వీరిపై ఎందుకు?
ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధులకు, అధికారులకు నిర్దిష్ట అధికారాలు ఉంటాయి. ఆ అధికారాలను ప్రజా క్షేమం కోసం కాకుండా, స్వప్రయోజనం కోసం వాడితే... అదే విశ్వాస ఘాతుకం, నమ్మక ద్రోహం, మోసం! ఉదాహరణకు... 'సత్యం' కంపెనీని సక్రమంగా నిర్వహించాల్సిన రామలింగరాజు అంకెల గోల్‌మాల్‌కు పాల్పడ్డారు. కంపెనీ చట్టాలు, సెబీ చట్టాల కింద తప్పు చేసినప్పటికీ... ఆయనపైనా కేసులో 409ను కూడా చేర్చారు. గతంలో కోటి రూపాయల లాటరీ పేరిట జనాన్ని మోసం చేసిన కోలా కృష్ణమోహన్‌పై 420 కింద మాత్రమే కేసు పెట్టారు. వీరిద్దరికీ ప్రభుత్వ ఆస్తులతో సంబంధంలేదు. అయినా 'సత్యం' కేసులో 409ను చేర్చారు.

దీంతో ఆయనకు బెయిలు దొరకడం దుర్లభంగా మారింది. ఇక... గనుల కేటాయింపులో చట్టబద్ధంగా వ్యవహరించాల్సిన శ్రీలక్ష్మి ప్రలోభాలు, స్వప్రయోజనాల కోసం వాటిని అడ్డగోలు అప్పగించారు. కేంద్ర మంత్రిగా 2జీ స్పెక్ట్రమ్‌ను సక్రమంగా కేటాయించాలిన ఎ.రాజా కూడా అడ్డదారి తొక్కారు. అందుకే, వీరందరిపైనా ఐపీసీ 409 సెక్షన్ కింద కేసు నమోదైంది. దీనివల్లే బెయిలు మంజూరు కష్టసాధ్యంగా మారింది. కనిమొళి బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో సోమవారం వాదోపవాదాలు జరుగుతున్నప్పుడు కూడా ఈ సెక్షన్‌పై ప్రధాన చర్చ జరిగింది.

409 సెక్షన్ వల్లే ఈ కేసులో నిందితులకు ఇప్పటిదాకా బెయిల్ లభించలేదనే అభిప్రాయం వ్యక్తమైంది. అంతకుముందే ఈ కేసులో సుప్రీంకోర్టు కొందరు నిందితులకు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరిపై 409 సెక్షన్ కింద కేసు నమోదైనట్లు సుప్రీం విస్మరించలేదని, కనిమొళిపైనా అవే అభియోగాలు ఉన్నప్పటికీ... బెయిలు ఇస్తున్నామని తెలిపింది. వీరి బెయిలు పిటిషన్‌ను సీబీఐ వ్యతిరేకించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

సీబీఐ చేతిలో బ్రహ్మాస్త్రం
409 ఐపీసీ ఇప్పుడు సీబీఐ చేతిలో బ్రహ్మాస్త్రంగా మారింది. నిందితులను ఎక్కువ కాలం తమ కస్టడీలో ఉంచుకోవడానికి, నేరం రుజువైతే గరిష్ఠ శిక్ష వేయించడానికి ఆయుధంగా ఉపయోగపడుతోంది. వెరసి... ప్రాసిక్యూషన్ ఏజెన్సీకి ఈ సెక్షన్ ద్వారా అపరిమితమైన అధికారాలు లభిస్తాయి. 2జీ కేసులో రాజా, కణిమొళి తదితరులపై కేసులో 409 సెక్షన్‌ను కూడా చేర్చినప్పుడు దాని ప్రభావం ఎవరికీ భోదపడలేదు. వాదోపవాదాలు జరగడం, పదే పదే బెయిల్ పిటిషన్లను కోర్టులు కొట్టివేయడంతో దీని 'పవర్' ఏమిటో తెలిసొచ్చింది.

"2జీ స్పెక్ట్రమ్ అంటే విద్యుదయస్కాంత తరంగాలు మాత్రమే. అది ఆస్తి కాదు. అందువల్ల... దుర్వినియోగానికి ఆస్కారమేలేదు'' అని నిందితుల తరఫు లాయర్లు వాదించారు. సీబీఐ దీనిని తిప్పికొట్టింది. "ఆస్తులు అనేక రూపాల్లో ఉంటాయి. కొన్ని అంశాలపై ఉన్న హక్కులను కూడా ఆస్తులుగానే పరిగణించవచ్చు. లైసెన్సులు, కాపీరైట్లు, ట్రేడ్ మార్కులు కూడా ఆస్తులే'' అని వాదించింది. అంతెందుకు... ఇటీవల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో జరిగిన అవినీతిపైనా ఇదే కోణంలో వాదోపవాదాలు జరిగాయి.

"మాది ఒక అసోసియేషన్. పబ్లిక్ సర్వెంట్, వాణిజ్యవేత్త, బ్యాంకర్, ఏజెంట్ మొదలైన నిర్వచనాలు మాకు వర్తించవు'' అని ఈ కేసులో నిందితులు శివలాల్ యాదవ్, ఇతరులు బలంగా వాదించారు. అయితే, ఈ అసోషియేషన్‌కు ప్రభుత్వం నిధులు అందిస్తుంది కాబట్టి వాటిని ఖర్చుపెట్టిన ప్రతినిధుల చర్యలు నమ్మక ద్రోహం కిందకే వస్తాయని తీర్పు చెప్పింది. వె రసి... రాజా నుంచి శివలాల్ యాదవ్ వరకు చట్టం చట్రంలో ఇరికించింది '409 ఐపీసీ' సెక్షనే! గతంలో 409ను ఎక్కువగా ప్రయోగించేవారు కాదు. ఇప్పుడు... ఏసీబీ కేసుల్లోనూ దీనిని జోడిస్తున్నారు.

ఐపీసీ 409 అంటే...
"సక్రమ నిర్వహణ కోసం అప్పగించిన ఆస్తులను ఒక పబ్లిక్ సర్వెంట్, వాణిజ్యవేత్త, మధ్యవర్తి, అటార్నీ లేదా ఏజెంట్ దుర్వినియోగం చేస్తే విశ్వాస ఘాతుకంగా పరిగణిస్తారు. ఈ నేరం రుజువైతే పదేళ్ల నుంచి గరిష్ఠంగా యావజ్జీవ శిక్ష వరకు విధించవచ్చు. జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధించవచ్చు''. 

 https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/nov/30/main/30main3&more=2011/nov/30/main/main&date=11/30/2011

No comments:

Post a Comment