Thursday 1 December 2011

అందరూ దొంగలే ! : కేవీపీ వియ్యంకుడికీ 'కోల్‌కతా కనెక్షన్'

'అల్లిబిల్లి' రఘురాజా!
కేవీపీ వియ్యంకుడికీ 'కోల్‌కతా కనెక్షన్'

అనామక కంపెనీలోకి కోట్ల తరలింపు..
తర్వాత అదే కంపెనీ కొనుగోలు
మనీ లాండరింగ్ మాయాజాలం..
ఎమ్మార్ 'విల్లా'సంలో మరో కోణం
కేవీపీ కుమారుడి ఇంటికి కోనేరు సొమ్ము?..
ఎంజీఎఫ్‌కు వాటా వెనుక కీలక నేత
ప్రతిఫలంగా అపార్ట్‌మెంట్ల ప్రాజెక్టు కైవసం
హైదరాబాద్, నవంబరు 26 : వైఎస్ హయాంలో భారీగా చక్రం తిప్పిన కేవీపీ వియ్యంకుడు రఘురాజు ఎమ్మార్‌కు చెందిన బౌల్డర్ హిల్స్‌లో ఒక విల్లా, నాలుగు ప్లాట్లు సొంతం చేసుకున్నారు. ఈ సంగతిని 'ఆంధ్రజ్యోతి' సవివరంగా బయటపెట్టింది. ఈ ప్లాట్ల 'కొనుగోల్‌మాల్' వెనుక ఎవరున్నారనే అంశంపై సీబీఐ శోధిస్తుండగానే మరికొన్ని కొత్త విషయాలు బయటపడ్డాయి. వైఎస్ జగన్ తరహాలోనే రఘురాజు కూడా అల్లిబిల్లి కంపెనీల ద్వారా కోట్ల రూపాయలను తన ఖాతాలోకి మళ్లించినట్లుగా తెలుస్తోంది.

ఇద్దరికీ కోల్‌కతా కంపెనీల కనెక్షన్ ఉండటం ఇక్కడ గమనార్హం. కోల్‌కతాకు చెందిన అనామక కంపెనీలు ఒక అనామక సంస్థలోకి పెట్టుబడులను ప్రవహింప చేశాయి. ఆ తర్వాత అదే కంపెనీని రఘురాజు కొనుగోలు చేశారు. పైకి ఇది సాధారణమైన 'డీల్'లా కనిపించినప్పటికీ... కోల్‌కతా కంపెనీలకు వచ్చిన డబ్బుల మూలాలు ఎక్కడున్నాయన్నదే ప్రశ్న! ఆదాయపు పన్ను శాఖ సిబ్బంది రెండు దఫాలు సోదాలు జరిపినప్పుడు రఘురాజు నివాసంలో సుమారు రూ.110 కోట్ల మేరకు నల్ల ధనం వివరాలు బయటపడ్డాయి.

ఈ సంగతిని ఐటీ మరింత తవ్విపోయకుండా.. ఆయన మొత్తం డబ్బుకు పన్ను కట్టినట్లు తెలిసింది. ఎమ్మార్‌లో ప్రాజెక్టులో గోల్‌మాల్ జరగడం, అక్కడే రఘురాజుకు ఒకవిల్లా, ఐదు ప్లాట్లు ఉండటం, ఆయన ఇంట్లో భారీగా బ్లాక్‌మనీ బయటపడటం, ఆయన కేవీపీ వియ్యంకుడు కావడం... వీటన్నింటిని గమనిస్తే ఒకదానితో మరొకదానికి 'లింకు' ఉన్నట్లే కనిపిస్తుంది. ఎక్కడి నుంచో వచ్చిన 'అనుమానాస్పద' సొమ్మునే రఘురాజు అనామక కంపెనీ ద్వారా 'అధికారికం' చేసుకున్నట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి. దీనిపై సమగ్ర విచారణ జరిపితే ఎమ్మార్, మనీ లాండరింగ్‌తోపాటు మరికొన్ని కోణాలు కూడా బయటపడే అవకాశం కనిపిస్తోంది.

సొమ్ములు ఎక్కడివో?
మరోవైపు.. వైఎస్ ఆత్మబంధువు, రఘురాజు వియ్యంకుడైన కేవీపీ కుమారుడు దుబాయ్‌లో నివసించే భవంతికి... ఎమ్మార్ కేసులో అరెస్టయిన కోనేరు ప్రసాద్‌కూ 'సంబంధం' ఉన్నట్లు తెలుస్తోంది. 'పామ్ జుమేరియా' పేరిట దుబాయ్‌లో నిర్మించిన కృత్రిమ ద్వీపంలో ఒక భవంతిని కేవీపీ కుమారుడు సొంతం చేసుకున్నారు. ఆయన నివాసం కూడా అక్కడే. అప్పట్లో ఈ ఇంటిని సుమారు రూ.30 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ మొత్తాన్ని కోనేరు ఖాతా నుంచే సర్దుబాటు చేసినట్లు తెలుస్తోంది.

ఎవరా బినామీ?
రాష్ట్రాన్ని కుదిపేసిన కుంభకోణాల్లో ఎమ్మార్ ప్రాపర్టీస్ గోల్‌మాల్ ఒకటైతే... ఓఎంసీ మైనింగ్ లీజుల కేసు మరొకటి! గాలి లీజుల్లో 'క్యాప్టివ్' పదం ఎగిరిపోవడమే స్కామ్! ఎమ్మార్ ప్రాపర్టీస్ విషయంలో 'ఎంజీఎఫ్' వచ్చి చేరడమే అసలు మాయా జాలం! ఏపీఐఐసీ, ఎమ్మార్ కలిసి ఏర్పాటు చేసిన మూడు స్పెషల్ పర్పస్ వెహికల్స్‌లో ఎమ్మార్ హిల్స్ టౌన్‌షిప్ ప్రాజెక్ట్ లిమిటెడ్ (ఈహెచ్‌టీపీఎల్) ఒకటి! ఇందులో ఎమ్మార్ తన వాటాను ఎంజీఎఫ్‌కు అక్రమంగా బదిలీ చేయడంతో... ఏపీఐఐసీ ఆదాయానికి గండి పడింది. వెరసి... మధ్యలో చేరిన ఎంజీఎఫ్‌కు భారీ స్థాయిలో లబ్ధి చేకూరింది!

వైఎస్ హయంలో ముఖ్యపాత్ర పోషించిన నాయకుడే ఎంజీఎఫ్‌కు 'వాటా' కల్పించడంలోనూ చక్రం తిప్పినట్లు పరిశ్రమశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు ప్రతిఫలంగా ఆయన... ప్రతిష్ఠాత్మకమైన ఈహెచ్‌టీపీఎల్‌లోని అపార్ట్‌మెంట్ల ప్రాజెక్టును కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మార్ కేసు సీబీఐ పరిధిలోకి వెళ్లకుండా, తన బినామీ దందా బయటపడకుండా ఆ నాయకుడు విశ్వప్రయత్నాలు చేసినట్లు సమాచారం. అయినప్పటికీ... ఫలితం లేకపోవడం, విషయాన్ని సీబీఐ లోతుగా తవ్వుతుండటంతో ఆ నేత వ్యవహారం కూడా బయటపడుతోంది. సదరు నేత ఎమ్మార్ విల్లాల అమ్మకంలోనూ కీలకపాత్ర పోషించారని అధికార వర్గాలు చెబుతున్నాయి.

అక్కడే అసలు కథ...
తమ ప్రాజెక్టులో ఎంజీఎఫ్‌కు చెందిన ఫెయిర్ బ్రిడ్జి హోల్డింగ్స్ లిమిటెడ్‌కు 34 శాతం వాటా ఇచ్చేందుకు అనుమతించాలంటూ ఎమ్మార్ ప్రాపర్టీస్ 2005 మే 2న ఏపీఐఐసీకి లేఖ రాసింది. ఈ ప్రతిపాదనను ఏపీఐఐసీ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ప్రాజెక్టులు పూర్తయ్యేదాకా ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు సంబంధించిన మూడు ఎస్‌పీవీలలో వాటాల మార్పునకు అంగీకరించేదిలేదని తేల్చి చెప్పింది. కానీ, తర్వాత భారీ స్థాయిలో మంత్రాంగం జరిగింది. ఎంజీఎఫ్‌తో ఈహెచ్‌టీపీఎల్ 2006 నవంబర్ 3న అభివృద్ధి ఒప్పందం చేసుకుంది.

2007 జూలై 25న అభివృద్ధి ఒప్పందంతోపాటు జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తూ మరో ఒప్పందం జరిగింది. ఎమ్మార్ సంస్థ ఈహెచ్‌టీపీఎల్‌కు చెందిన 258 ఎకరాలను ఎమ్మార్-ఎంజీఎఫ్‌కు బదిలీ చేయడంతోపాటు మార్కెటింగ్, బ్రాండింగ్ బాధ్యతలు అప్పగించింది. ఈహెచ్‌టీపీఎల్ బోర్డులో డైరెక్టర్లుగా ఉంటూ, ఏపీఐఐసీ ప్రయోజనాలు కాపాడాల్సిన ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య, పార్థసారథి రావు కూడా ఇందుకు తల ఊపారు. ఈ డైరెక్టర్లు నాటి పాలక పెద్దలకు అస్మదీయులు కావడం విశేషం!

ఏపీఐఐసీ పాలక మండలికిగానీ, ప్రభుత్వానికిగానీ సమాచారం అందించకుండానే... ఈ చీకటి 'వ్యవహారం' నడిపించారు. ఎంజీఎఫ్‌తో ప్రభుత్వ పెద్దల ప్రయోజనాలు ముడిపడినందునే అప్పటి ఏపీఐఐసీ అధికారులు కూడా ఈ విషయంలో చూసీచూడనట్లు వ్యవహరించారని చెబుతున్నారు. వాస్తవానికి ఎమ్మార్ ప్రాపర్టీస్‌తో కుదిరిన అనుబంధ ఒప్పందంలోని క్లాజు-8 ప్రకారం ఈహెచ్‌టీపీఎల్ హౌసింగ్ ప్రాజెక్టును అంతర్గతంగా సమకూర్చుకున్న వనరుల ద్వారా చేపట్టాలని స్పష్టంగా ఉంది. దీని ప్రకారం తనకున్న హక్కులను అభివృద్ధి ఒప్పందం పేరుతో ఇతరులకు బదిలీ చేసే అధికారం ఈహెచ్‌టీపీఎల్‌కు లేదు.

ఈహెచ్‌టీపీఎల్‌లోకి ఎంజీఎఫ్ భాగస్వామిగా చేరడంతో ఈ ప్రాజెక్టుకు మూలాధారమైన 258 ఎకరాల భూమి సమకూర్చిన ఏపీఐఐసీ వాటాకు పూర్తిగా గండిపడింది. చివరకు ఈ ప్రాజెక్టులో ఏపీఐఐసీ ఓ దిష్టి బొమ్మగానే మిగిలింది. ఎమ్మార్‌లో భాగస్వామిగా చేరిన ఎంజీఎఫ్ 2008 ఆగస్టు 1న గచ్చిబౌలి సర్వే నెంబర్ 91 (పీ)లో 14.07 ఎకరాలను తనఖా పెట్టి... యాక్సిస్ బ్యాంకు నుంచి 150 కోట్ల రూపాయల రుణం పొందింది. యాక్సిస్ బ్యాంకు ఎకరా 22 కోట్ల విలువ కట్టింది. అంటే, ఈహెచ్‌టీపీఎల్‌కు 258 ఎకరాలు సమకూర్చిన ఏపీఐఐసీకి చెందిన 26 శాతం వాటాకుగాను 1475 కోట్ల రూపాయలు రావాలి. కానీ, ఇంత వరకూ ఒక్క రూపాయి కూడా ఏపీఐఐసీ ఖాతాలో పడలేదు! ఇదీ... ఎంజీఎఫ్ మాయ!

 https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/nov/27/main/27main10&more=2011/nov/27/main/main&date=11/27/2011

No comments:

Post a Comment