Thursday 1 December 2011

అందరూ దొంగలే ! : గట్టు విప్పిన 'డెలాయిట్' సుదర్శన్

డొల్ల సాక్షి
గట్టు విప్పిన 'డెలాయిట్' సుదర్శన్
మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం
మళ్లీ అడ్డంగా దొరికిన జగన్

జగతి విలువను సాయిరెడ్డి పెంచాలన్నారు
పాత తేదీలతో రిపోర్ట్ ఇవ్వాలన్నారు
అది సొంత అవసరాలకే అని చెప్పారు
మా సంస్థ పేరును వాడుకున్నారు
అధిక ధరకు షేర్లు అమ్ముకున్నారు
'డెలాయిట్' సుదర్శన్ వెల్లడి
అక్రమాస్తుల కేసులో కీలక మలుపు
జగన్, విజయసాయి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
విశ్వసనీయతపై పేటెంట్ తమదే అన్నట్లు మాటలు! 'విలువ'లకు పాతరేసేలా చేతలు! అడ్డగోలు లెక్కలతో గొప్పలు చెప్పిన జగన్ అసలు అవతారం మరోసారి బయటపడింది. సీబీఐ కార్యాలయంలో జరిగిందొకటైతే... బయటికి వచ్చి మరొకటి చెప్పి జనానికి మసి పూయ చూసిన జగన్, ఆడిటర్లతోనూ ఇలాంటి ఆటలే ఆడి అడ్డంగా దొరికిపోయారు.

'మీ నాన్న వరదరాజులు రెడ్డికి మంత్రి పదవి ఇస్తాం' అంటూ కొండారెడ్డిని బుజ్జగించి, బెదిరించి మరీ గనుల రేసు నుంచి తప్పించి... చివరికి 'పెద్ద చెయ్యి' ఇచ్చారు. 'ఆఫీసు అవసరాలకు మాత్రమే వాడుకుంటాం. మా కంపెనీల వాల్యుయేషన్‌ను రూ.3500 కోట్లుగా రాసివ్వండి' అంటూ డెలాయిట్ సంస్థను మభ్యపెట్టి... తర్వాత అదే అంచనాను బహిర్గతం చేసి, పెట్టుబడులకోసం వాడి ఇచ్చిన మాట తప్పారు. విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ విషయం డెలాయిట్ కంపెనీ సీనియర్ డైరెక్టర్ సుదర్శన్ ఇచ్చిన వాంగ్మూలంతో స్పష్టమైంది. ఇదీ... జగన్ విశ్వసనీయత!

ఇక ఆయన వ్యాపార దక్షత విషయానికి వద్దాం! 'మా సంస్థ విలువను డెలాయిట్ సంస్థ రూ.3500 కోట్లుగా అంచనా వేసింది. విజయవంతమైన వ్యాపారవేత్తను కాబట్టే నన్ను నమ్మి పెట్టుబడులు పెట్టారు' అంటూ జాతీయ మీడియా ముందు జగన్ ఊదరగొట్టారు. తన తండ్రి హయాంలో ప్రభుత్వం నుంచి పొందిన 'మేళ్ల'కు ప్రతిఫలంగానే తన కంపెనీలో పెట్టుబడులు పెట్టారనే (క్విడ్-ప్రొ-కొ) వాదనలను కొట్టిపడేశారు.

కానీ... తప్పుడు విలువతో, తప్పుడు లెక్కలు చూపినట్లు ఇప్పుడు రుజువైంది. వెరసి... ఆ పెట్టుబడులు జగన్ వ్యాపార దక్షతను చూసి రాలేదని, ఆయన తండ్రి నుంచి వివిధ ప్రాజెక్టులు పొందిన వారు ఈ రూపంలో ప్రతిఫలం సమర్పించుకున్నారని స్పష్టమవుతోంది. అంతేకాదు... 'జగతి' విలువ అంచనాపై ఆగస్టు 18 నాటి 'ఆంధ్రజ్యోతి' కథనం అక్షరాలా నిజమని స్పష్టమైంది.


హైదరాబాద్, నవంబర్ 9 : అబ్బురపరిచే సమర్థత! అదరగొట్టే వ్యాపార దక్షత! 'నా అంతటి వాడు లేడు' అని చెప్పుకోవడం! అందరూ పరిగెత్తుకొచ్చి... 30 రూపాయల షేరును రూ.350 పెట్టి కొనడం! అమ్మ జగనా... ఇన్ని అబద్ధాలా! కొండారెడ్డి చేతికి అడ్డంగా దొరికిపోయి, మైనింగ్ కేసులో అడ్డంగా బుక్కైన 'యువనేత'... ఇప్పుడు 'డెలాయిట్' విప్పిన లెక్కలతో చిక్కుల్లో పడిపోయారు. ఆ సంస్థ సీనియర్ డైరెక్టర్ పీఎన్ సుదర్శన్ సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంతో జగన్ అసలు రంగు మరింత స్పష్టంగా బయటపడింది.

ఈ వాంగ్మూలం ప్రకారం... తప్పుల కుప్ప నుంచి పుట్టిన తన పత్రిక, చానల్‌కు 'ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్' అంటూ ఓ తప్పుడు అంచనా ఇప్పించుకున్నారు. జగన్ కంపెనీల్లో పెట్టుబడులుపెట్టిన వారంతా... డెలాయిట్ పేరే వల్లె వేశారు. ఆ సంస్థ వేసిన అంచనాల మేరకే, భారీ ప్రీమియంతో షేర్లు కొన్నామని చెప్పుకొచ్చారు. దీంతో సీబీఐ అధికారులు డెలాయిట్ ప్రతినిధి సుదర్శన్‌ను ప్రశ్నించారు. 164 సీఆర్‌పీసీ కింద మేజిస్ట్రేట్ ఎదుట ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం... డెలాయిట్ కంపెనీ 'సాక్షి'కి వ్యాపార ప్రణాళిక మాత్రమే ఇచ్చింది.

అందులోనూ... అనూహ్యంగా మొదటి సంవత్సరం నుంచే లాభాలు వస్తాయని తెలిపింది. ఈ బిజినెస్ ప్లాన్ ఆధారంగానే చెన్నైకి చెందిన 'జగదీశన్ అండ్ కో' జగతి పబ్లికేషన్స్ విలువను అంచనా వేసింది. అది... 178 కోట్ల నుంచి రూ.196 కోట్ల మధ్య మాత్రమే ఉంటుందని లెక్క తేల్చింది. ఇందిరా టెలివిజన్‌కు రూ.183 కోట్ల నుంచి 185 కోట్ల వాల్యుయేషన్ ఇచ్చింది. జనని ఇన్‌ఫ్రాకు రూ.29 కోట్ల విలువ కట్టింది. ఇదీ అసలు విషయం!

మరి... జగన్ చెబుతున్న రూ.3500 కోట్ల విలువ ఎక్కడిది? డెలాయిట్ ఎప్పుడు ఈ అంచనా వేసింది? ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు దొరుకుతున్నాయి. జగదీశన్ అండ్ కంపెనీ కట్టిన అంచనా ఏమాత్రం ఆకర్షణీయంగా లేకపోవడంతో జగన్ కంపెనీ... కొత్త ఎత్తులు వేసింది. బిజినెస్ ప్లాన్‌కు మాత్రమే పరిమితమైన డెలాయిట్‌ను మరోమారు సంప్రదించింది. లేని విలువను కొత్తగా 'సృష్టించింది'.

"సాక్షి వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డి నా వద్దకు వచ్చారు. జగతి పబ్లికేషన్స్, జననీ ఇన్‌ఫ్రా, ఇందిరా టెలివిజన్ల వాస్తవ విలువను రూ.3000 కోట్ల నుంచి 3500 కోట్ల వరకు అంచనా వేయాలని కోరారు. అదీ... పాత తేదీలతో కావాలని అడిగారు. అలా ఎందుకని ప్రశ్నించగా... ఇది కేవలం ఆఫీసు అవసరాల కోసమేనని, దానిని బయట ఉపయోగించుకోబోమని విజయసాయి రెడ్డి చెప్పారు'' అని డెలాయిట్ ప్రతినిధి సుదర్శన్ సీబీఐ ముందు స్పష్టం చేసినట్లు తెలిసింది.

"వాస్తవ విలువను ఎక్కువగా చూపించి మాతో వాల్యుయేషన్ వేయించుకున్నారు. అంచనా విలువను బహిరంగపరచి మా సంస్థ పేరును అడ్డం పెట్టుకుని ఎక్కువ ధరకు షేర్లు అమ్ముకున్నారు. మాతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని విజయసాయిరెడ్డి ఉల్లంఘించారు'' అని సుదర్శన్ వివరించినట్లు తెలిసింది. ఇలా అంతర్గత అవసరాల కోసం 'ఇప్పించుకున్న' అంచనాలను అడ్డం పెట్టుకుని పెట్టుబడుల కథ నడిపించినట్లు సుదర్శన్ వాంగ్మూలంతో స్పష్టమవుతోంది.

అరెస్టు తప్పదా?
డెలాయిట్ ప్రతినిధి వాంగ్మూలంతో జగన్ అక్రమాస్తుల కేసు కీలక మలుపు తిరిగినట్లయింది. జగన్‌తోపాటు విజయసాయి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఇక అవసరమై తే అరెస్టులు కూడా ప్రారంభించాలని సీబీఐ అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. జగన్ అక్రమాస్తులకు సంబంధించి అవినీతి నిరోధక చట్టం, మనీలాండరింగ్‌తోపాటు 420 ఐపీసీ రెడ్‌విత్ 120బీ ప్రకారం కేసులు నమోదయ్యా యి. ఆధారాలను ధ్వంసం చేసే ప్రయత్నం, మోసపూరిత గూడుపుఠాణీ అంశాలను ఎఫ్ఐఆర్‌లో ప్రస్తావించారు. 

 https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/nov/10/main/10main1&more=2011/nov/10/main/main&date=11/10/2011

No comments:

Post a Comment