Thursday 1 December 2011

అందరూ దొంగలే ! : ఓఎంసీలో గాలి.. బయ్యారంలో బ్రదర్ సేవ

వై..ఎస్!
ఆమెకు తెలిసిన రెండే రెండు పదాలు!
స్థాయి మరచి దాసోహం
ఓఎంసీలో గాలి.. బయ్యారంలో బ్రదర్ సేవ

పెద్దోళ్ల సేవలో తరించిన 'అయ్యా..ఎస్'
గనుల్లో బోల్తా పడ్డ వై.శ్రీలక్ష్మి
హైదరాబాద్, నవంబర్ 28 : ఆమె పేరు.. వై.ఎస్!! సాధారణ వ్యక్తులకు 'వై'! పెద్దలకు మాత్రం 'ఎస్'! వైఎస్‌కు మాత్రం 'అయ్యా.. ఎస్'!! ఆమెకు తెలిసిన రెండే రెండు పదాలివి. సాధారణ వ్యక్తులు ఎవరైనా ఆమెతో పని చేయించుకోవడం అంత సులభం కాదు. కానీ, పెద్దలు అడగడమే తరువాయి చెప్పినట్లు చేయడమే ఆమె పని. ఎందుకు.. ఏమిటి? అనే ప్రశ్నలు ఆమెకు అలవాటు లేవు. ఆమే.. ఐఏఎస్ అధికారి వై.శ్రీలక్ష్మి!!

వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గనుల శాఖ వ్యవహారాలు చూసే పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఆమె చక్రం తిప్పారు. పూర్తిగా పెద్దోళ్ల సేవలో తరించారు. 'డబ్బు తీసుకున్నా కూడా... చెప్పిన పని చెప్పినట్లు చేయడంలో ఆ అధికారి అంత వేగంగా మరొకరు ఉండరు' అని గత ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన నేత తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారంటే శ్రీలక్ష్మి పనితీరును అర్థం చేసుకోవచ్చు.

అనంతపురం జిల్లాలోని వేల కోట్ల రూపాయల ఇనుప ఖనిజ నిక్షేపాలను ఓఎంసీకి, బయ్యారంలోని ఇనుప ఖనిజ సంపదను బ్రదర్ అనిల్‌కుమార్ బినామీగా ఉన్న రక్షణ స్టీల్స్‌కు, విశాఖపట్నం జిల్లాలోని లక్షల కోట్ల రూపాయల విలువ చేసే బాక్సైట్ నిక్షేపాలను జిందాల్, అన్‌రాక్‌లకు పెద్దలు చెప్పినట్లు కట్టబెట్టేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశారు. చీమకుర్తి గనులను 'ఘనుల'కు ధారాదత్తం చేయడంలోనూ ఆమెదే కీలక పాత్ర!

ఓఎంసీ గోల్‌మాల్
గాలి జనార్దన రెడ్డికి చెందిన ఓఎంసీకి వేల కోట్ల రూపాయల ఖనిజ సంపద కట్టబెట్టేందుకు శ్రీలక్ష్మి పక్కాగా పథక రచన చేశారు. తొలి దరఖాస్తుదారులైన సునీల్ ఎర్ల, జి.సురేష్‌బాబు, కొండారెడ్డి, శశికుమార్ తదితరులను రకరకాల కారణాలు చెప్పి రేసు నుంచి తప్పించారు. లీజులను గాలికి కట్టబెట్టేందుకు వీలుగా 'స్టీల్ ప్లాంట్' వాదనను తెరపైకి తెచ్చారు. కడప జిల్లాలో వేల కోట్ల రూపాయల పెట్టుబడితో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయటానికి ఓఎంసీ ముందుకు వచ్చిందని, అందువల్ల ఆ సంస్థకే లీజు ఇవ్వడం సముచితమంటూ ఫైలులో పేర్కొన్నా రు.

ఇనుప ఖనిజం నిక్షేపాలను స్టీల్ ప్లాంట్ సొంత అవసరాలకే ఉపయోగించాలని నోట్‌ఫైలులో స్పష్టం చేశారు. కానీ, జీవోలు వచ్చేసరికి 'క్యాప్టివ్' పదం ఎగిరిపోయింది. పథకం ప్రకారం మొత్తం వ్యవహారాన్ని చక్కబెట్టి.. 2007 జూలై 18న ఓఎంసీకి 68.50 హెక్టార్ల లీజులు అప్పగిస్తూ జీవో 151, మరో 39.81 హెక్టార్ల లీజులు కేటాయిస్తూ 152 జీవోలు జారీ చేశారు.

కానీ, 'గనుల శాఖలో గోల్‌మాల్. బ్రహ్మణి కోసమే తొలి దరఖాస్తుదారుల బలి' పేరుతో 'ఆంధ్రజ్యోతి' కథనం ప్రచురించింది. ఇక అప్పటి నుంచి కథ మళ్లీ మొదటికి రావడం.. బాధితుల ఫిర్యాదులతో సుప్రీం కోర్టు నియమించిన సాధికార కమిటీ రంగంలోకి దిగడం.. గాలి గనుల్లోని అక్రమాలను నిర్ధారించడం వరుసగా జరిగిపోయాయి. తీరా కేసు సీబీఐకి చేరడంతో అప్పట్లో గాలికి సహకరించిన రాజగోపాల్, శ్రీలక్ష్మి కటకటాల పాలు కావాల్సి వచ్చింది.

బ్రదర్‌కు బయ్యారం కానుక
ఖమ్మం జిల్లాలోని బయ్యారం, నేలకొండపల్లి, గార్ల మండలాల్లో ఉన్న ఇనుప ఖనిజం నిక్షేపాలను వైఎస్ అల్లుడైన బ్రదర్ అనిల్ కుమార్ బినామీ కంపెనీ రక్షణ స్టీల్స్‌కు కానుకగా ఇచ్చేందుకు శ్రీలక్ష్మి సహకరించారు. ఇందుకోసం వందలాది ఇతర దరఖాస్తులను పక్కన పెట్టేశారు. అనంతరం రక్షణ స్టీల్స్‌కు లీజులు కట్టబెట్టేందుకు వీలుగా ఖమ్మం జిల్లాలోని 1.40 లక్షల ఎకరాల్లోని నిక్షేపాలను ఏపీఎండీసీ పేరిట రిజర్వు చేయించారు. వాటి ని రక్షణ స్టీల్స్‌కు సరఫరా చేసేలా ఏపీఎండీసీ ఒప్పందం కుదుర్చుకుంది.

ఇందుకు అనుగుణంగా 2009 ఫిబ్రవరి 24న జీవో నం.69 జారీ చేశారు. ఓఎంసీ - బ్రహ్మణి తరహాలోనే ఇక్కడ కూడా స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు రక్షణ స్టీల్స్ ముందుకొచ్చింద నే అంశాన్ని తెరపైకి తెచ్చి కథ నడిపించారు. రక్షణ స్టీల్స్‌తో ఏపీఎండీసీ ఒప్పందాన్ని ఓకే చేసింది కూడా శ్రీలక్ష్మి నేతృత్వంలోని కమిటీయే కావడం విశేషం. కానీ, కేంద్ర ప్రభుత్వ జోక్యంతో ఈ దోపిడీకి తెరపడింది.

బాక్సైట్ భగభగలు విశాఖ అటవీ ప్రాంతంలో బాక్సైట్ నిక్షేపాల తవ్వకాన్ని గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా... వైఎస్ సర్కారు ఇక్కడ కూడా ఏపీఎండీసీని రంగంలోకి దింపి అస్మదీయ సంస్థలకు ఖనిజ సంపద తరలించాలని నిర్ణయించింది. ఇక్కడ కూడా మైనింగ్ లీజులను నేరుగా ప్రైవేట్ సంస్థలకు కేటాయించే అవకాశం లేకపోవడంతో ఏపీఎండీసీని పావుగా ఉపయోగించుకున్నారు. రస్ అల్ ఖైమా, జిందాల్ సంస్థలు విశాఖ జిల్లాలో ఒక్కొక్కటీ రూ.9000 కోట్ల పెట్టుబడితో అల్యూమినియం యూనిట్లు ఏర్పాటు చేయటానికి ముందుకు వచ్చాయని చెప్పి ఒప్పందాలు చేసుకున్నారు.

ఇందులోనూ పాత్రధారులు అప్పట్లో గనుల శాఖ అధికారులుగా ఉన్న శ్రీలక్ష్మి, వీడీ రాజగోపాల్‌లే. ఈ ఒప్పందాల ప్రకారం ఏపీఎండీసీ రస్ అల్ ఖైమాకు చెందిన అన్‌రాక్‌కు 224 మిలియన్ టన్నులు, జిందాల్‌కు 240 మిలియన్ టన్నులు సరఫరా చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఏపీఎండీసీకి భారీ ఎత్తున ప్రయోజనం ఉంటుందా? అంటే అదీ లేదని గనుల శాఖ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం నిర్ణయించిన బాక్సైట్ సరఫరా ధర చాలా తక్కువగా ఉందని చెబుతున్నారు. అంతిమ లక్ష్యం అన్‌రాక్, జిందాల్‌లకు 'మేళ్లు' చేయటమే కాబట్టి బాక్సైట్ సరఫరా ఒప్పందంలోనూ గోల్‌మాల్‌కు పాల్పడ్డారు.

చీమకుర్తిలోనూ చీకటి కోణాలు
ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ లీజుల కేటాయింపులోనూ చీకటి కోణాలే. ఇక్కడ కూడా తొలి దరఖాస్తుదారులను బలిచేసి ఏపీఎండీసీని తెరపైకి తెచ్చారు. అస్మదీయ సంస్థలకు మేలు చేసి పెట్టడానికి పథక రచన చేశారు. ఇందులో భాగంగానే 'గ్లోబల్ టెండర్లు' నాటకానికి తెరతీశారు. సాధారణంగా టెండర్‌లో ఎవరు ఎక్కువ ధర చెల్లిస్తే వారికి లీజులు ఇవ్వడం ఆనవాయితీ. కానీ, ఇక్కడ కూడా క్యూబిక్ మీటర్‌కు గరిష్ఠంగా రూ.4500 చెల్లిస్తే సరిపోతుందని నిర్ణయించటం వెనకే అసలు మతలబు ఉంది. అంతిమంగా అస్మదీయ సంస్థలకు మేలు చేసి పెట్టడానికే ఈ ధరను నిర్ణయించినట్లు గనుల శాఖ వర్గాలు తెలిపాయి.

గ్లోబల్ టెండర్ల పేరుతో లీజులను మిడ్ వెస్ట్, జింపెక్స్, పల్లవ తదితర సంస్థలకు కేటాయించారు. ఫలితంగా, ఏపీఎండీసీకి వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు గనుల శాఖ వర్గాలు తెలిపాయి. ఇటీవలి వరకూ ఏపీఎండీసీ ఎండీగా పనిచేసిన ప్రవీణ్ ప్రకాశ్.. ఈ లీజు ఒప్పందాలు సక్రమంగా జరగలేదని, ఒప్పందాల సవరణకు అనుమతించాల్సిందిగా కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. 

 https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/nov/29/main/29main6&more=2011/nov/29/main/main&date=11/29/2011

No comments:

Post a Comment