Thursday 22 December 2011

మా టర్నోవర్ అంతా బూటకమే - వాణిజ్య పన్నుల శాఖ ఎదుట సుజనా గ్రూపు అంగీకారం : Our Turnover is all But Fake - Sujana Group

 
మా టర్నోవర్ అంతా బూటకమే

వాణిజ్య పన్నుల శాఖ ఎదుట సుజనా గ్రూపు అంగీకారం
 
చిన్న చిన్న షెడ్లలో మామూలు మెషీన్లు పెట్టుకుని నట్లు, బోల్టులు, టీఎంటీ బార్లు వంటి ఉక్కు ఉప ఉత్పత్తులను తయారు చేసుకునే సుజనా గ్రూప్ సంస్థలు.. రాష్ట్రంలో అతి పెద్ద ఉక్కు కర్మాగారమైన వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీతో పోటాపోటీగా వ్యాపారం చేస్తున్నట్లు పద్దులు సృష్టించాయి. 2011 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సుజనా గ్రూపు సంస్థలైన సుజనా యూనివర్సల్, సుజనా మెటల్, సుజనా టవర్స్ అనే మూడు సంస్థల మొత్తం టర్నోవర్ రూ. 10,000 కోట్లు దాటినట్లు చెప్తున్నాయి. వైజాగ్ స్టీల్‌తో పోలిస్తే.. ఏ మూలకూ సరితూగని ఈ సుజనా సంస్థలకు అన్ని వేల కోట్ల టర్నోవర్ ఎలా సాధ్యమైంది? ఆ సంస్థల 2011 బ్యాలెన్స్ షీట్‌ను పరిశీలిస్తే.. కంపెనీల సంస్థాపక సామర్థ్యానికి, అవి నమోదు చేసిన టర్నోవర్లకు ఎక్కడా పొంతన లేదు. ఉదాహరణకు.. సుజనా యూనివర్సల్ సంస్థలో బేరింగ్స్ స్థాపక సామర్థ్యం కోటి బేరింగ్‌లుగా ఉంటే.. నిజానికి ఒక్క బేరింగ్ కూడా ఉత్పత్తి చేయలేదు. స్టీల్ ఉత్పత్తుల విషయంలో ట్రేడింగ్ ద్వారా పది లక్షల టన్నుల వ్యాపారం చేసినట్లు లెక్కచూపారు. ఇతర ఉత్పత్తులు అంటూ మరో 40 లక్షల టన్నులు నమోదు చేశారు. ఈ ఇతర ఉత్పత్తులు ఏమిటనేది ఎవరికీ అంతుపట్టనిది. నిజానికి తాము కాగితాల్లో చూపే వ్యాపారమంతా ఉత్తుత్తిదేనని సుజనా సంస్థలే గతంలో స్వయంగా వాణిజ్య పన్నుల శాఖ వద్ద అంగీకరించాయి. ఈ విషయాన్ని హైకోర్టులో ఒక కేసు విచారణ సందర్భంగా వాణిజ్య పన్నుల శాఖ తన కౌంటర్ అఫిడవిట్‌లో వెల్లడించగా.. 2009లో ఇచ్చిన ఆ కేసు తీర్పులోనూ ధర్మాసనం యథాతథంగా ప్రస్తావించింది. ‘‘... 
 
షోకాజ్ నోటీస్‌కు పిటిషనర్ (సుజనా గ్రూపు సంస్థలు) సమాధానం ఇస్తూ.. తమ కొనుగోళ్లు, అమ్మకాలు కేవలం ఊహాజనితమని.. మంచి ఫలితాలు చూపటానికి, కంపెనీ టర్నోవర్‌ను పుస్తకాల్లో ఎక్కువగా చూపటానికి చేసిందేనని అంగీకరించారు. అంతేకాకుండా.. తాము వాణిజ్య పద్దు పద్ధతిని అనుసరిస్తామని.. ఎలాంటి విక్రయాలు జరగకుండానే, సరకుల రవాణా లేకుండానే అమ్మకపు బిల్లులు జారీచేస్తామని కూడా పేర్కొన్నారు. తమ కంపెనీలు ప్రకటించిన వ్యాపార సామర్థ్యాన్ని అందుకున్నట్లు చూపించేందుకు, తమ సంస్థల ఈక్విటీలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు.. వాస్తవంగా ఎలాంటి సరకులు తెచ్చిందీ, పంపించిందీ లేకపోయినా.. కొనుగోళ్లు, అమ్మకాలు జరిగినట్లు లావాదేవీలు నమోదు చేశామని వారు వెల్లడించారు’’ అన్న విషయాన్ని ఉటంకించింది. సుజనా గ్రూపు సంస్థలు తమ వ్యాపారానికి సంబంధించి కోట్ల రూపాయల్లో వాణిజ్య పన్నులు ఎగవేశాయని సంబంధిత శాఖ అధికారులు ఇచ్చిన నోటీసులపై.. ఆయా సంస్థలు హైకోర్టును ఆశ్రయించగా.. వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఈ విషయాన్ని కౌంటర్ అఫిడవిట్‌లో తెలిపారు. ఈ కేసును విచారించిన జస్టిస్ ఈశ్వరయ్య, జస్టిస్ అఫ్జల్‌పుర్కార్‌లతో కూడిన ధర్మాసనం 2009 జనవరిలో సుజనాచౌదరికి అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వటం కొసమెరుపు!
 
 http://sakshi.com/main/Fullstory.aspx?catid=286252&Categoryid=1&subcatid=33

No comments:

Post a Comment