విజయమ్మ పేర్కొన్న ఆధారాలపై లోతుగా అధ్యయనం 
ఆదివారం కూడా విధులకు హాజరైన జేడీ, ఇతర అధికారులు 
ప్రశ్నావళికి రూపకల్పన.. నేడు చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్, హెరిటేజ్లకు నోటీసులు! 
 
హైదరాబాద్,  న్యూస్లైన్: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమాలు, ఆదాయానికి మించి  ఆస్తులు కూడబెట్టిన వ్యవహారంలో... సీబీఐ అధికారులు ఆయన అవినీతి మూలాలపై  ప్రధానంగా దృష్టిసారిస్తున్నారు. రాజకీయాల్లోకి రాకముందు ఉన్న  ఆస్తులు...తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో లెక్కకుమిక్కిలిగా  పెరిగిన ఆస్తులపై దర్యాప్తు జరపాలని భావిస్తున్నారు. భూకేటాయింపులు,  ప్రాజెక్టుల కాంట్రాక్టులు ఇవ్వడం ద్వారా పెద్ద ఎత్తున లబ్ధిపొందారనే  ఆరోపణల నేపథ్యంలో.. తొమ్మిదేళ్లలో చంద్రబాబు చేసిన కేటాయింపులు..  కూడబెట్టిన అక్రమ ఆస్తుల బండారాన్ని బట్టబయలు చేస్తూ వైఎస్ విజయమ్మ  సమర్పించిన దాదాపు 2 వేల పైచిలుకు డాక్యుమెంట్ల రూపంలోని ఆధారాలను  క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. సీబీఐ జేడీ వి.వి.లక్ష్మీనారాయణతోపాటు  ఇతర అధికారులు ఆదివారం కూడా విధులకు హాజరయ్యారు. చంద్రబాబుతోపాటు  ప్రతివాదులుగా ఉన్న 12 మంది నుంచి ఏం సమాచారం కోరాలనే విషయంపై సుదీర్ఘంగా  చర్చిస్తున్నారు. ఈ మేరకు ప్రశ్నావళిని సైతం రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ  నేపథ్యంలో తమకు కావాల్సిన డాక్యుమెంట్లతో హాజరుకావాల్సిందిగా మొదటి దఫాగా  బాబు, భువనేశ్వరి, లోకేష్, హెరిటేజ్లకు సోమవారం నోటీసులు జారీ  చేయనున్నారు.  
 
కుప్పలుతెప్పలుగా పెరిగిన ఆస్తులపై ఆరా! 
 
1986లో తన కుటుంబం మొత్తానికి 70 ఎకరాల భూమి ఉండేదని, అప్పట్లో కుటుంబం  విడిపోయాక తన వంతుగా వచ్చిన సొమ్ముతో నెల్లూరు జిల్లా బాలాయపల్లిలోని  నిండాలిలో భూములు కొన్నట్లు.. 1988లో కోర్టుకు సమర్పించిన ఒక అఫిడవిట్లో  చంద్రబాబు పేర్కొన్నారు. ఆ భూముల ద్వారా తనకు ఏడాదికి రూ.36,000 ఆదాయం  వచ్చేదని, తాను స్వయంగా వ్యవసాయం చేస్తూ హైబ్రిడ్ వేరుశనగ పండించేవాడినని  తెలిపారు. కానీ చంద్రబాబు 1978లో మంత్రి పదవి చేపట్టిన నాటినుంచే అక్రమ  మార్గాల్లో ఆస్తిని పెంచుకుంటూ పోయారు.  
 
సొంత తండ్రికే తన భూమిని  తనఖా పెట్టడం, విక్రయించటం వంటి లావాదేవీలు నడిపారు. 1983లో టీడీపీలో  చేరుతూనే తిరుపతిలో త్రీస్టార్ హోటల్ నిర్మించారు. తర్వాత దాన్ని టీడీపీకి  చెందిన మరో నేతకు విక్రయించారు. కాగా నిండాలి, వాక్యం గ్రామాల్లో తన  బంధువుల నుంచి అతితక్కువ రేటుకు అంటే ఎకరా రూ.1,000 చొప్పున 1985లో తొలుత  65 ఎకరాలు కొనుగోలు చేసిన చంద్రబాబు... ఆ తరవాత బినామీ పేర్లతో మరో 250  ఎకరాలు కొన్నారు. ఈ మొత్తం భూముల చుట్టూ 12 కిలోమీటర్ల మేర ప్రహరీ  నిర్మించారు. అంతేకాదు.. ప్రభుత్వ భూముల్ని, నాలుగు పెద్ద చెరువుల్ని  ఆక్రమించి మరీ తోట నిర్వహిస్తుండటాన్ని విజయమ్మ ఆధారాలతో సహా వివరించారు.  అప్పట్లో తెహల్కా డాట్ కామ్ ఈ భూముల లోగుట్టును బయటపెట్టడంతో కారుచౌక ధరలకు  తన బంధువులకు వీటిని విక్రయించినట్లుగా చూపించి... ఇప్పటికీ తన బినామీ  తోటగా దాన్ని కొనసాగిస్తున్న వైనాన్నీ.. విజయమ్మ తెలిపారు. ఇలా  రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆస్తులు పెరిగిన తీరుపై చంద్రబాబును వివరణ  కోరాలని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. మరోపక్క ఈ కేసుపై దర్యాప్తు  జరపాలని డీజీపీని సైతం కోర్టు ఆదేశించడంతో ఈమేరకు సీఐడీ కూడా కసరత్తు  చేస్తోంది. సీబీఐ అధికారులతో కలిసి ప్రాథమిక విచారణ జరపాలని వారు  నిర్ణయించినట్లు సమాచారం. 
 
విశాఖ నుంచి ప్రత్యేక బృందం 
 
బాబు అక్రమాస్తుల కేసు దర్యాప్తునకు విశాఖపట్నం నుంచి ఐదుగురు అధికారులతో  కూడిన బృందం హైదరాబాద్లోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకుంది. సీబీఐ  జేడీ లక్ష్మీనారాయణ నేతృత్వంలో వీరు విధులు నిర్వర్తిస్తారు. విజయమ్మ  సమర్పించిన ఆధారాల అధ్యయనం బాధ్యతను జేడీ వీరికి అప్పగించినట్లు  తెలుస్తోంది.  http://www.sakshi.com/main/FullStory.aspx?catid=274949&Categoryid=1&subcatid=33   | 
No comments:
Post a Comment